బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్ను గుర్తింపు పత్రంగా స్వచ్ఛందంగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ‘ఆధార్, ఇతర చట్టాల (సవరణ)బిల్లు, 2019’ను గురువారం లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆధార్ స్వచ్ఛందమని అంతకుముందు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గోప్యత, భద్రతలకు సంబంధించిన అంశాల పరిష్కారం కోసం సవరణలు తీసుకొచ్చామని, ఆధార్ లేనంతమాత్రాన ఎలాంటి సేవలు, పథకాల ప్రయోజనాల్ని తిరస్కరించడం జరగదని చెప్పారు. కేంద్రమంత్రి సభలో తన కార్డును ప్రదర్శిస్తూ.. కార్డులో కేవలం, పేరు, తండ్రిపేరు, పుట్టిన తేది, నివాస చిరునామా మాత్రమే ఉంటాయని, ఆరోగ్యం, కులం, మతం, వర్గపరమైన ఇతరత్రా ఎలాంటి సమాచారం ఉండదని స్పష్టం చేశారు. ఐటీ మంత్రిగా తాను ఆధార్ సమాచారాన్ని కోరితే తనకూ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం త్వరలోనే డేటా రక్షణ చట్టాన్ని తీసుకొస్తుందని, డేటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment