2017-18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగి 45ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ మేరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఎన్ఎస్ఎస్ఓ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయనప్పటికీ ఇందులోని వివరాలను సదరు మీడియా సంస్థ తమ కథనంలో ఉటంకించింది. దీంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి తెరతీసింది.
2017 జులై నుంచి 2018 జూన్ మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 6.1శాతంగా నమోదైందని ఎన్ఎస్ఓస్ఓ నివేదిక వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. 1972-73 తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం 7.8శాతంగా ఉండగా.. గ్రామాల్లో 5.3శాతంగా నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా.. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నిరుద్యోగులపై ఎన్ఎస్ఎస్ఓ సర్వే చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఉద్యోగాల కల్పన సర్వేను ప్రచురించకపోవడం, యూపీఏ హయాం కన్నా ఎన్డీయే పాలనలోనే ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు వీలుగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని లెక్కించే ప్రమాణాలను మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జాతీయ గణాంకాల సంఘం నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గణాంకాల కమిషన్ తాత్కాలిక ఛైర్మన్ పీసీ మోహనన్, మరో సభ్యురాలు మీనాక్షి తమ పదవులకు రాజీనామా చేశారు.
No comments:
Post a Comment